GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:22 pm Posted by : GURU SWAMY

అటవీ భూముల సరిహద్దుల్లో అక్రమ మట్టి తవ్వకాలు..!

గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, చెదులపాకం గ్రామాల పరిధిలో అటవీ భూముల సరిహద్దులను ఆనుకుని అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అటవీ భూములకు ఆనుకుని ఉన్న బఫర్ జోన్ ప్రాంతాల్లో భారీగా మట్టి తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసినా అధికార యంత్రాంగంలో చలనం కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా అటవీ భూములను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతుండటం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ విషయమై అటవీ శాఖ అధికారులను సంప్రదించగా, ఇటువంటి తవ్వకాలకు తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఫారెస్ట్ రేంజర్ తెలిపారు. గత మూడు నెలలుగా ఈ అంశంపై స్థానిక తహసీల్దార్‌కు నివేదికలు పంపుతున్నప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
అటవీ ప్రాంతాన్ని ఆనుకుని భారీ గుంతలు తవ్వడం వల్ల అడవి జంతువులు ప్రమాదవశాత్తూ అందులో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా స్థానిక రాజకీయ నాయకులతో కలిసి కొంతమంది అధికారులు అక్రమ మట్టి రవాణా ద్వారా భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అనుమతులు లేకుండానే రియల్ ఎస్టేట్ వెంచర్లకు, అలాగే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మట్టిని భారీగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ తవ్వకాలపై జిల్లా యంత్రాంగం, గనుల శాఖ, రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.