GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 4:02 pm Posted by : GARUDA DHATRI NEWS

అర్హులందరికీ విద్యుత్ సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోండి -ఎంపి గురుమూర్తి

తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశం తిరుపతి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబడింది. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ ఎస్.ఈ, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.ఈసందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నారాయణవనం పవర్ లూమ్స్ సమస్య, చిట్టమూరు మండలంలోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ సరైన విధంగా అందకపోవడం వంటి అంశాల గురించి ఎంపీ వివరాలు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు సబ్సిడీ పరిధిలోకి రాకపోవడం వల్ల రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఆ లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకంపై పట్టణ ప్రాంతాల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే వ్యవసాయ అవసరాల కోసం పీఎం కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.తీర మరియు మెట్ట ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ఈ పథకాలు వారికి చేరువయ్యేలా చేయాలని సూచించారు. గ్రామాలలోని చెరువు కట్టల వద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశాలపై ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అదనంగా గ్రామాల్లో విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు వీధి దీపాలను ఆటోమేటిక్ వ్యవస్థలతో అమలు చేయాలని, దీని ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ఈ చర్యలన్నీ సమర్థవంతంగా అమలు అయితే ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరడంతో పాటు విద్యుత్ వినియోగంలో సామర్థ్యం పెరుగుతుందని ఎంపీ మద్దిల గురుమూర్తి అభిప్రాయపడ్డారు.