*కడప జిల్లా……*
*ఇంధన సరఫరాలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు..!*
* *జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి*
* *జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధి మీనా లతో కలిసి పాత్రికేయుల సమావేశం*
* *జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్: 08562-246344 ఏర్పాటు*
కడప, ఏప్రిల్ 27 : జిల్లాలో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సమానంగా, నిరంతరంగా ఇంధనం అందించేందుకు తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.. జిల్లాలో ఇంధన సరఫరాపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధి మీనా లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయిన IOCL, HPCL, BPCL, నయారా, రిలయన్స్ సంస్థలకు చెందిన పలు రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం కొరత ఏర్పడటం జరిగిందన్నారు. ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సమానంగా, నిరంతరంగా ఇంధనం అందించేందుకు ఇంధన సరఫరాలో రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 242 పెట్రోల్ బంకులు ఉండగా, వీటికి వివిధ డిపోల నుంచి ట్యాంకర్ లారీల ద్వారా సరఫరా జరుగుతోందన్నారు. అయితే గ్లోబల్ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో బల్క్ వినియోగదారులు రిటైల్ బంకులపై ఆధారపడటం పెరిగిందన్నారు. దీని వల్ల కొద్దిసమయంలోనే కొన్ని బంకులలో డీజిల్ పూర్తిగా అయిపోవడం, తద్వారా సరఫరా జాప్యం ఏర్పడి ఇతర బంకులపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో HPCLకు చెందిన 95 బంకుల్లో 31 బంకులు, IOCLకు చెందిన 67 బంకుల్లో 17 బంకులు, BPCLకు చెందిన 63 బంకుల్లో 19 బంకులు, ESSAR/నయారా సంస్థకు చెందిన 14 బంకుల్లో 3 బంకులు, రిలయన్స్కు చెందిన 3 బంకుల్లో 1 బంకులో నిల్వలు లేకపోవడం గమనార్హం అన్నారు. మొత్తం 242 బంకుల్లో 71 బంకుల్లో ఇంధన కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ వినియోగానికి 10 శాతం అదనంగా ఇంధన సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి పెట్రోల్ బంక్పై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి, సరఫరా మరియు అమ్మకాలపై నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ (ఫోన్: 08562-246344) ఏర్పాటు చేయగా, ప్రతి ఆయిల్ కంపెనీకి ఉప కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంధన సరఫరా సమానంగా జరిగేలా తాత్కాలికంగా “రేషనలైజేషన్” విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధానం ప్రకారం మూడు చక్రాల ప్యాసింజర్ ఆటోలకు ఎలాంటి పరిమితి లేకుండా డీజిల్ అందించనుండగా, కార్లు మరియు చిన్న సరుకు వాహనాలకు గరిష్టంగా 30 లీటర్లు, ప్రైవేట్ బస్సులు మరియు సరుకు రవాణా లారీలకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వాలని నిర్ణయించారన్నారు.
అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అంబులెన్స్లు, ప్రజా రవాణా వాహనాలు, నీరు మరియు పాలు ట్యాంకర్లు, గ్యాస్ సిలిండర్ సరఫరా వాహనాలకు నిరంతర ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ సరఫరా తహసీల్దార్ల సిఫార్సు మేరకు అనుమతించబడుతుందని తెలిపారు.
ఇకపై పెట్రోల్ బంకుల వద్ద బాటిల్స్, క్యాన్లు, డ్రమ్స్లో ఇంధనం నింపడం పూర్తిగా నిషేధించబడిందని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయకుండా ప్రభుత్వ చర్యలకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
** జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇంధన కృత్రిమ కొరత అనేది తాత్కాలిక సమస్య మాత్రమే అని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా సమస్యాత్మకంగా ఇంధన సరఫరా జరగ బోదని తెలిపారు. అందుకుంతగిన అన్ని రకాల భద్రతా చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు గమనిస్తే, వదంతులు ఉంటే వెంటనే జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రజాలను అనవసరంగా భయాందోళనకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు మరియు వాహనదారులు తదితర వినియోగదారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.