GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:01 pm Digital Edition : GURU SWAMY

ఎండుతున్న పంటలపై మండలంలో శాస్త్రవేత్తల పర్యటన

చౌడేపల్లి ఆగస్టు 04 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలంలోని కొండా మరి, వెంగళపల్లి, దిగువపల్లి గ్రామాలలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన
కృషి విజ్ఞాన కేంద్రం ,కలికిరి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ కే మంజుల ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన స్థానం పెరమాళ్ళపల్లి శాస్త్రవేత్తలు ,కే వి కె ,మరియు అగ్రి పాలిటెక్నిక్ కలికిరి శాస్త్రవేత్తలు చౌడేపల్లి మండలంలొ వివిధ గ్రామ పంచాయతీల్లో ఎల్ ని నో ప్రభావం వల్ల దెబ్బతింటున్న వివిధ పంటలను పరిశీలించారు.
వేరుశనగ పంట వర్షాలు లేనందువలన చాలా చోట్ల పెరుగుదల లేకపోవడంతో పాటు చెట్లు ఎండిపోవడం మొదలైనట్లు గుర్తించారు. అంతర వరుసలుగా వేసినటువంటి అలసంద, అనుమలు కూడా వాడిపోయినట్లు ఎక్కువగా బీడు భూములు కనిపిస్తున్నాయి. ఆవులకు పెంచుకునే సూపర్ నేపియర్, జొన్న లాంటి పశుగ్రాస పంటలు కూడా బోర్ల కింద నీరు తగ్గిపోవడంతో వాడి ఎండిపోతున్నాయి అని తెలిపారు. ఆగస్టు – సెప్టెంబర్ మాసాలలో వర్షం వచ్చినప్పుడు కంది, అలసంద, అనుమలు, ఉలవ, పెసర ,మినుము, కొర్ర, జొన్న ,సజ్జ ,ఆముదం మొదలగు పంటలను సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు . పంట నుంచి వచ్చే వ్యర్ధాలను, ఎండి రాలే ఆకులను, చిరుకొమ్మలను మొదలగు వాటిని కొద్దిపాటి విస్తీర్ణంలో పెంచుకుంటున్న కూరగాయలు, పండ్ల తోటలలో, మరియు పూల తోటలలో ఆచ్చాదనంగా (మల్చింగ్) వేసుకోవాలని ,తద్వారా నీటి తడను తగ్గించుకోవచ్చని ,ఈ పదార్థమే కుళ్ళి ఎరువుగా ఉపయోగపడుతుందని తెలిపారు. వీలైన వారు పొలాల దగ్గర వర్షపు నీరు నిలువ ఉండగల గుంతలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. రైతులు పంట భీమా తప్పనిసరిగా చేయించుకోవాలి అని పర్యటన బృందం తెలియచేసింది. ఈ పొలాల సంధర్శనలో పెరుమాళ్ళపల్లి రీసెర్చ్ స్టేషన్ హెడ్ డాక్టర్.ఎమ్.రెడ్డి కుమార్ , సైంటిస్ట్ డాక్టర్ కె ఆర్ ఠాగోర్, మండల వ్యవసాయ అధికారి మోహన్ సబ్జెక్టు మాటర్ స్పెషలిస్ట్ ఎస్. సోమశేఖర బాబు మరియు అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ టీచర్ జ్యోత్స్న మరియు అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యార్థినులు మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.