పిచ్చాటూరు, ఆగస్టు 12 గరుడధాత్రి:
పిచ్చాటూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ సమావేశంలో పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం -ఐవిఆర్ఎస్ ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాలపై చర్చించారు.
ప్రతి నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ లబ్ధిదారులకు IVRS కాల్స్ ద్వారా వారి అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ప్రవర్తన, లబ్ధిదారులకు సక్రమంగా నగదు అందజేస్తున్నారా అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు.
మండలంలోని పెన్షన్ లబ్ధిదారుల నుంచి 100 శాతం సంతృప్తికరమైన అభిప్రాయాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ సమావేశానికి పెన్షన్స్ ఎస్ఆర్పి విజయవాడకు చెందిన డేగాలయ్య, తిరుపతి డిఆర్డిఎ పెన్షన్స్ డిపిఎం విజయ, ఏపియం రాధమ్మ హాజరయ్యారు. ఎంపీడీవో మహమ్మద్ రఫీ, డిప్యూటీ ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.