GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 12:43 am Digital Edition : GURU SWAMY

ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారులు..!!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, పురపాలక ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది

*ఏపీ స్థానిక ఎన్నికలకు సన్నాహాలు

*అధికారులు సిద్ధం చేసిన నివేదికలు

*కోర్టు కేసులు తొలగితే నోటిఫికేషన్

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, పురపాలక ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తమ పూర్తిస్థాయి సన్నద్ధత నివేదికలను అందజేశారు. కోర్టుల్లో చిక్కుకున్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతే, తక్షణమే ఎన్నికల ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి.

*పురపాలికలు, కోర్టు కేసుల పరిస్థితి..*

వార్డుల పునర్విభజనపై కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తే కేవలం 20 రోజుల్లోనే 100 పురపాలికల్లో అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పదవీకాలం పూర్తయిన 87 పురపాలక సంస్థల్లో ఎన్నికలు(Ap Local Body Elections) జరిపేందుకు ఎస్‌ఈసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ సహా పలు పురపాలికలపై దాఖలైన రిట్ పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి.

*గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రణాళిక..*

పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 13,341 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాల రూపకల్పన వేగవంతంగా సాగుతోంది. కోర్టు వివాదాల కారణంగా గతంలో ఆగిపోయిన సుమారు 100 పంచాయతీలను మినహాయించి, మిగిలిన చోట్ల ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం సర్వసిద్ధంగా ఉంది. న్యాయ చిక్కులన్నీ పరిష్కారమైతే రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.