కార్వేటినగరం, ఆగస్టు 7 (గరుడ దాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నమోదును విజయవంతంగా నిర్వహించేందుకు మండల విద్యాశాఖ అధికారుల అధ్యక్షతన మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ , మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్యకు దూరమైన వారు, పాఠశాల మానేసిన విద్యార్థులు, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా మరో అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఆర్సీ సభ్యులు, మహిళా పోలీసులు, గ్రామ/వార్డు సచివాలయాల విద్యా మరియు సంక్షేమ కార్యదర్శులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళా పోలీసులు, సంక్షేమ మరియు విద్యా కార్యదర్శులు, ఎంఆర్సీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అర్హులైన విద్యార్థులను గుర్తించి, వారికి ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై పూర్తి అవగాహన కల్పించి, అధిక సంఖ్యలో ప్రవేశాలు నమోదు చేయాలని సూచించారు.
ప్రతి గ్రామం, వార్డులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, విద్యకు దూరమైన ప్రతి ఒక్కరికీ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించే అవకాశాన్ని కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.