నాగలాపురం, జూన్ 23 గరుడధాత్రి న్యూస్:
రాబోయే ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించే దిశగా సత్యవేడు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్ అన్నారు. మంగళవారం మండలంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్లు 212 మరియు 213లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బిఎల్ ఓ యాప్లో జరుగుతున్న EF’s (Enumeration Forms) డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. నమోదవుతున్న వివరాల ఖచ్చితత్వం, అప్డేట్ విధానం, ఫీల్డ్ స్థాయిలో అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు, వివరాల సవరణల ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నమోదు సరైన ఆధారాలతో, ఎటువంటి పొరపాట్లు లేకుండా డిజిటల్ రూపంలో నమోదు చేయాలని BLOలకు ఆదేశాలు జారీ చేశారు.
డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగంతో పాటు నాణ్యత కూడా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో తహసీల్దార్ రోజరాణి, వీఆర్వో నాగభూషణం, తరుణ్, బి ఎల్ ఓ లు ఢిల్లీ, కవిత తదితరులు పాల్గొన్నారు.