GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:40 pm Digital Edition : GURU SWAMY

కళాశాల కాఫౌండ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

పిచ్చాటూరు, ఆగస్టు 3 గరుడధాత్రి:
సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం సోమవారం పిచ్చాటూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పనుల నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే, నిర్మాణ పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థుల భద్రతకు కాంపౌండ్ వాల్ ఎంతో అవసరమని పేర్కొంటూ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై పనుల పురోగతి, కళాశాల అవసరాలు, విద్యార్థులకు ఉన్న మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఇళంగోవ రెడ్డి, డిల్లీ, వాసు, వినాయగన్, కళాశాల అధ్యాపకులు, స్థానిక నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.