GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:05 pm Digital Edition : GURU SWAMY

కవిత కొత్త పార్టీ.. ఇంతకీ ఈ ‘పాంచజన్యం’ అసలు కథేంటో తెలుసా ?

*కవిత కొత్త పార్టీ.. ఇంతకీ ఈ ‘పాంచజన్యం’ అసలు కథేంటో తెలుసా ?* తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత ఎవరూ ఊహించని విధంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి తెరపైకి వచ్చారు.మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తమ నూతన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పిడికిలి బిగించి ఎన్నో కష్టాలు పడి కొట్లాడామని గుర్తుచేశారు. ఆ ఉద్యమ సమయంలో జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని ఎంతో పదిలంగా కాపాడుకున్నారని ఆమె ప్రశంసించారు. అనంతరం తమ పార్టీ తరఫున ‘పాంచజన్యం’ అనే పేరుతో ఐదు ప్రధాన హామీలను కవిత ప్రకటించారు.

ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, అసలు పాంచజన్యం అంటే ఏమిటి అని తెలుసుకునేందుకు సామాన్య ప్రజలు సైతం గూగుల్‌లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. పాంచజన్యం అనేది శ్రీమహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు ధరించే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన శంఖం పేరు. విష్ణువు ధరించే ఐదు ప్రధాన ఆయుధాలైన పంచాయుధాల్లో ఈ శంఖం ఒకటి.

పురాణాల ప్రకారం ఈ పాంచజన్య శంఖం వెనుక ఒక గొప్ప ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీప ముని వద్ద తమ విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, గురుదక్షిణగా తన కుమారుడిని తిరిగి తెమ్మని ఆ ముని కోరుతాడు. అప్పటికే ఆ బాలుడిని సముద్రంలో శంఖం రూపంలో ఉండే పంచజనుడు అనే రాక్షసుడు మింగేసి ఉంటాడు. గురువు కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని సంహరించి, గురుపుత్రుడిని యముడి దగ్గర నుంచి ప్రాణాలతో తిరిగి తీసుకువస్తాడు. ఆ రాక్షసుడి శరీరం నుంచి ఆవిర్భవించిన పవిత్రమైన శంఖమే ఈ పాంచజన్యం.

ఈ పవిత్రమైన శంఖాన్ని పూరించినప్పుడు వెలువడే ధ్వని పిడుగుల వలే అత్యంత భయంకరంగా ఉంటుంది. ఆ నాదం అధర్మపరుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది, అదే సమయంలో ధర్మం వైపు నిలబడిన వారిలో గొప్ప ఉత్సాహాన్ని నింపుతుంది. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో సైతం దీని ప్రస్తావన ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి సూచనగా శ్రీకృష్ణుడు తన పాంచజన్యం శంఖాన్ని గట్టిగా ఊదినట్లు అందులో స్పష్టంగా పేర్కొనబడింది.

పాంచజన్యం అనే పదానికి లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది. పాంచజన్యం అంటే ఐదు ఇంద్రియాలపై విజయం సాధించడం అని పండితులు చెబుతారు. ‘పంచ’ అంటే ఐదు అని, ‘జన’ అంటే ప్రాణులు లేదా జ్ఞానేంద్రియాలు అని అర్థం. మనలోని ఐదు ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి, వాటిని పరమాత్మ వైపు మళ్లించడానికి ఇది ఒక గొప్ప సంకేతంగా నిలుస్తుంది. హిందూ సంప్రదాయంలో పాంచజన్య శంఖం ఎల్లప్పుడూ విజయానికి, ధర్మానికి, పవిత్రతకు నిదర్శనంగా భావించబడుతుంది.