* అభివృద్ధి పనుల పరిశీలన- మౌలిక వసతుల పై వాకపు.
కుప్పం,సెప్టెంబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ గురువారం కుప్పం ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను సందర్శించి, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజల అవసరాలు, మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.కార్లగట్ట గ్రామాన్ని సందర్శించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ 12వ తరగతి చదువుతున్న రమ్య, 10వ తరగతి చదువుతున్న కావ్య అనే అక్కాచెల్లెళ్లను పరామర్శించారు.తల్లిదండ్రులను కోల్పోయిన ఈ ఇద్దరు ప్రస్తుతం వారి చిన్నాన్న నారాయణ సంరక్షణలో జీవిస్తున్నారు.రమ్య 12వ తరగతి అనంతరం నీట్ కోచింగ్లో చేరి వైద్య విద్యను అభ్యసించాలని తన ఆకాంక్షను కడ పీడీతో పంచుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విద్యార్థినుల భవిష్యత్తుకు అవసరమైన సహకారం అందిస్తామని వికాస్ మర్మత్ హామీ ఇచ్చారు.వారి విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందించడంతో పాటు, అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరుగా ఉండేందుకు ఒక ఆవును కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.గతంలో విద్యార్థినుల తల్లిదండ్రులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.1.25 లక్షల ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. అనంతరం శాంతిపురంలోని అన్న క్యాంటీన్ను సందర్శించిన పీడీ కడ, అక్కడ అందిస్తున్న ఆహారం నాణ్యత, రుచి, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని, ముఖ్యంగా క్యాంటీన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇస్కాన్ ప్రాంతాన్ని సందర్శించిన వికాస్ మర్మత్ ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూసమతలీకరణ పనుల పురోగతిని పరిశీలించారు.
భూసమతలీకరణ పనులను అక్టోబర్ 5, 2026 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ప్రధాన రహదారి నుంచి ఆలయానికి అనుసంధానమయ్యే రహదారిని 40 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణం, అనుబంధ మౌలిక వసతుల పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, 2028 జన్మాష్టమి నాటికి ఆలయంలో భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించేలా పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.కుప్పం ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వేగంగా, సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా పీడీ కడ తెలిపారు.