GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 6:36 am Digital Edition : GURU SWAMY

కుల వివక్షకు చరమగీతం పాడాలి – మెలుగు రమేష్

సత్యవేడు, ఆగస్టు 23 గరుడధాత్రి

కుల వివక్షకు చరమగీతం పాడాలని, దళితులు, గిరిజనుల హక్కులను కాపాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం , ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయి. ఈ మేరకు కేవీపీఎస్ నాయకులు ఎం. రమేష్ తెలిపారు.
సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం మండలాల్లో నిర్వహించిన సామాజిక శంఖారావం జాతా సందర్భంగా దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఎం. రమేష్ తెలిపారు. ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు లేకపోవడం, దళితులు, గిరిజనులు సాగు చేస్తూ అనుభవంలో ఉన్న భూములకు డి-పట్టాలు మంజూరు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
పట్టాలు మంజూరైన ప్రాంతాల్లో కూడా తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎం. రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక గ్రామాల్లో స్మశాన స్థలాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లేందుకు రహదారులు లేకపోవడం, కొన్ని చోట్ల స్మశాన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు.
మనిషి మరణించిన తర్వాత కూడా గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించుకోలేని పరిస్థితి కొనసాగడం సామాజిక వివక్షకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళితులు, గిరిజనులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు, సాగు భూములకు డి-పట్టాలు, స్మశాన స్థలాలు, స్మశాన వాటికలకు రహదారులు, తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఎం. రమేష్ పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం ఆగస్టు 24న తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ధర్నాకు దళితులు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎం. రమేష్ కోరారు.