GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:50 pm Digital Edition : GURU SWAMY

కూటమిలో జనసేనకు గుర్తింపు లేనట్లేనా ..?

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న అసంతృప్తి చర్చ

సత్యవేడు జూలై 06 గరుడధాత్రి :
కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెరపైకి వచ్చింది. కీలక కమిటీలు, నామినేటెడ్ పదవులు, స్థానిక స్థాయి నియామకాల విషయంలో జనసేనకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో సూళ్లూరుపేటలో జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కకపోవడం కూడా స్థానికంగా అసంతృప్తిని మరింత పెంచిన అంశంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పరిణామాలతో కూటమిలో జనసేన స్థానం, ప్రాధాన్యంపై రాజకీయ చర్చ మళ్లీ ఊపందుకుంది. అయితే ఈ అంశాలపై జనసేన పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.