GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:22 am Digital Edition : GURU SWAMY

క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబే

* రాష్ట్ర ఐటీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్.
* సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన నారా లోకేష్.
* బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు.
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్):90వ దశకంలోనే క్రీడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంచారని ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు పీవీ సింధు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యం కల్పించి క్రీడా విప్లవానికి చంద్రబాబు బాటలు వేశారని ఉద్ఘాటించారు. తరగతి గది జ్ఞానాన్ని ఇస్తే, క్రీడలు మనకు వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను నేర్పుతాయని చెప్పుకొచ్చారు. అందుకే ఏపీలో శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా ప్రకటించామని తెలిపారు. ప్రతి చిన్నారిలోనూ ఒక సహజ ప్రతిభదాగి ఉంటుందని వివరించారు. దానిని వెలికితీసి ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.పీవీ సింధు ప్రతి భారతీయుడూ గర్వించేలా చేశారన్నారు. ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తోంటే భారతదేశ భవిష్యత్తు మన ఎదురుగా కూర్చున్నట్టు అనిపిస్తోందన్నారు. జీవితం మనల్ని ఎక్కడకు తీసుకువెళుతుందో మనకు ఎవ్వరికీ తెలియదు కానీ వ్యవస్థ మీ ప్రతి ప్రయత్నంలో కేటలిస్టు పాత్ర పోషించగలదనేదే నా నమ్మకం అని అన్నారు.ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పీవీ సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి, గ్రీన్ కో ఎనర్జీ ఎఫీషియన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి పాల్గొన్నారు.