గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం…
అమ్మవారిని దర్శించుకున్న జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్..
గరుడధాత్రి న్యూస్ :
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు. మంగళవారం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకు మునుపు ఆయన ఆలయం వద్దకు రాగానే ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, పాలకమండలి సభ్యులు, ఈవో జయకుమార్ పురోహితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభముతో స్వాగతం పలికి అమ్మవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మంత్రితోపాటు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి , రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ లకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి సత్యప్రసాద్ కు గంగమ్మ తల్లి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలకు హాజరు కావాల్సి ఉండేదని, రాలేకపోవడం వల్ల ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. చైర్మన్ మహేష్ యాదవ్ నేతృత్వంలో ఆలయం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోందని, ఇంకా అభివృద్ధికి కావలసిన పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వము నుండి అందజేస్తామన్నారు. అమ్మవారి జాతర ఉత్సవాలను కనివిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వము సహకారంతో బాగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణా రెడ్డి,
కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తోట వాసుదేవ్ యాదవ్, ఆలయ పాలకమండలి సభ్యులు వినుకొండ లక్ష్మణరావు, కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ రామదాసు ముని రామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.