GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 9:28 pm Posted by : GARUDA DHATRI NEWS

గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి దివ్య విహారం

-కర్మ విముక్తిని ప్రసాదించే గజవాహన సేవ

-మంగళవాయిద్యాలు, కోలాటాలతో మారుమోగిన మాడవీధులు

-భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు

తిరుపతి,మే 28 గరుడధాత్రి :

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు సాగుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి గోవింద నామస్మరణతో స్వామివారిని సేవించుకున్నారు.
గజవాహనం ఐశ్వర్యానికి, మంగళానికి ప్రతీకగా భావించబడుతుంది. ఏనుగు ఓంకారస్వరూపానికి, విశ్వతత్త్వానికి సంకేతమని పురాణాలు వివరిస్తాయి. స్వామివారు గజరాజుపై విహరించడం ద్వారా అహంకారాన్ని విడిచి భగవంతుని శరణు చేరితే కర్మవిముక్తి కలుగుతుందనే సందేశాన్ని భక్తులకు అందించారు.
ఏడవ రోజు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీ శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.