GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 6:45 am Posted by : GARUDA DHATRI NEWS

గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం – మంత్రి అచ్చెన్నాయుడు

*Press Release*

గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం

– తెలుగుజాతికి పట్టిన రాజకీయ అరిష్టం జగన్ – మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే గొడ్డలి పార్టీ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రెస్‌మీట్‌లో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేక వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్ల పాలనలో విమర్శించడానికి ఒక్క అంశం కూడా దొరక్క చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ లాంటి స్వభావం ఉన్న వ్యక్తులు వస్తారని ముందే గుర్తించి దర్శకుడు శంక‌ర్ అపరిచితుడు సినిమా తీశారేమో అనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ చేసిన వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, నాటి చరిత్ర, వైఎస్ కుటుంబ రాజకీయ నేపథ్యం మొత్తం మళ్లీ చర్చకు వచ్చాయని అన్నారు. నేటి తరానికి వైఎస్ కుటుంబ చరిత్ర తెలిసేలా జగన్ స్వయంగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రాజారెడ్డి హత్య కేసులో ఉన్న నిందితులందరినీ చంపేశారని, ఒక్క పార్థసారధి రెడ్డి మాత్రమే మిగిలారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈరోజు వైసీపీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాడని పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే వంగవీటి రంగ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యులు కూడా జగన్ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడి కొడుకు నీకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకుతాడు… సెండాఫ్ ఇస్తాడు అంటూ జగన్‌ను ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్లపై ఎందుకు కక్షో అర్థం కావడం లేదన్నారు. తిరుమల ఏడుకొండల అంశాన్ని ప్రస్తావిస్తూ, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరచిపోలేదన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పుపట్టిన చంద్రబాబు వ్యాఖ్యలను ఇప్పుడు జగన్ వక్రీకరించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది జగన్ అని బొత్సనే చెప్పారని నేను చెబితే ఆయన ఎందుకు ఏడ్చారో ఇప్పటికీ అర్థం కాలేదు అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి, మళ్లీ వాళ్లకు రాజ్యసభ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. నీ సొంత చెల్లెలు వైఎస్ సునీత జగన్ ప్రమేయం ఉందని చెబుతోంది… దానికి సమాధానం చెప్పగలవా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం బాబాయినే కాదు, సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదల్లేదని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి మరణం, బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామా గురించి మాట్లాడిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వాటిపై మాట్లాడలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబుకు నోటీసు కూడా ఇవ్వకుండా 53 రోజులు జైలులో పెట్టారని, తాను తప్పు చేయకపోయినా వేధింపులకు గురిచేశారని అన్నారు. అప్పటి ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజును చిత్రహింసలకు గురిచేశారని, కోర్టుల వల్లే ఆయన ప్రాణాలు దక్కాయని చెప్పారు. సోషల్ మీడియాలో తల్లి, చెల్లిని కూడా వదలకుండా అసభ్య పోస్టులు పెట్టించారని ఆరోపించారు.డాక్టర్ సుధాకర్ ఘటన, రేపల్లె నియోజ‌క‌వ‌ర్గంలో అమర్‌నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ పాలనలో జరిగిన దమనకాండకు ఇవే నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీసి ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజారెడ్డి నుంచి వివేకా వరకు ప్రతి చావులో జగనే ప్రధాన లబ్ధిదారు. జగన్‌ను సైకో అనాలా… పిచ్చోడు అనాలా అర్థం కావడం లేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిపై జగన్ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, అమరావతికి రాజముద్ర పడిన తర్వాత కూడా మావిగన్ అంటున్నారు. గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, ఐకానిక్ రాజధాని రోడ్లు అన్నీ ఒకేలా ఉంటాయా? అని ప్రశ్నించారు. విశాఖలో జగన్ కట్టుకున్న ప్యాలెస్‌కు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారు. ఆస్తి, పదవి కోసం కార్యకర్తలను కూడా వదలరు. ఆ పార్టీ కార్యకర్తనే కారు కింద వేసి తొక్కించేశారు అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. జీతాలు ఇస్తే చాలు అని ఉద్యోగులతో దండాలు పెట్టించుకున్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా జగన్ తగ్గించలేదు. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి అంశాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని, విద్యుత్ ఛార్జీలను తగ్గించిన చరిత్రను ఎన్డీయే ప్రభుత్వం సృష్టించిందన్నారు. ఇకపై జగన్ చేసే ప్రతి అబద్ధపు ఆరోపణకు వడ్డీతో సహా సమాధానం చెబుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.