GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 5:12 pm Posted by : GARUDA DHATRI NEWS

చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిసిన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు

చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిసిన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు

నాగలాపురంలో జరుగుతున్న శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగగా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనాలతో విశేష అభిషేకాలు చేపట్టి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.తదనంతరం ఉదయం 11.30 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు పవిత్ర స్నానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.కాగా రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చంగల్ రాయులు, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

——————–