చౌడేపల్లి, ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాతి కావ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సులో భాగస్వాములైన ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, స్టాఫ్ నర్సులు మరియు స్థానిక ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ, సరైన పోషకాహారం, రోగనిరోధకత, మహిళా శారీరక ఆరోగ్యం ఇన్ఫెక్షన్ల నివారణ విధానాలపై స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే ముందు వరుస ఆరోగ్య కార్యకర్తల బాధ్యతలను వివరిస్తూ, వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు డాక్టర్ కావ్య క్లినికల్ మెళకువలు, సులువైన కౌన్సెలింగ్ పద్ధతులను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు.
సమాజ ఆరోగ్య పరిరక్షణకు ఆమె కనబరుస్తున్న అంకితభావం, నిరంతర సేవలను గుర్తిస్తూ నిర్వాహక సంస్థ డాక్టర్ కాతి కావ్యకు ‘ప్రశంసా పత్రం’ అందజేసి ఘనంగా సత్కరించింది. ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన ఇలాంటి నాణ్యమైన శిక్షణా కార్యక్రమాలు స్థానికంగా వైద్య సేవల ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయని వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేశారు.