పిచ్చాటూరు, మే 28 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల పరిధిలో కొనసాగుతున్న జలధార–జలహారతి పనులను మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మహ్మద్ రఫీ గురువారం పరిశీలించారు. మండలంలోని పిచ్చాటూరు అరిగియారి ప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న జలధార–జలహారతి పనులు మరియు చేపల కుంట అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పనులు నిర్వహిస్తున్న శ్రామికులతో మాట్లాడిన ఎంపీడీవో, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రోజువారీ కూలీలకు గిట్టుబాటు అయ్యే విధంగా పనులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
అలాగే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కార్మికులకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.