GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 4:59 am Digital Edition : GURU SWAMY

జాతీయ ఉపకారవేతనానికి పులికుండ్రం విద్యార్థిని ఎంపిక

జ్ఞాన ప్రసూనకు ఎంపీటీసీ రమేష్‌రాజు అభినందనలు

పిచ్చాటూరు: మండలంలోని పులికుండ్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని జి. జ్ఞాన ప్రసూన నేషనల్‌ మీన్స్‌-కమ్‌-మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్ఎంఎంఎస్‌-2025)కు ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉపకారవేతనానికి అర్హత సాధించింది.

ఎన్ఎంఎంఎస్‌ ఉపకారవేతనం కింద ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఇంటర్మీడియట్‌ విద్య పూర్తయ్యే వరకు ఈ ఉపకారవేతనం కొనసాగనుంది.

జ్ఞాన ప్రసూన ప్రతిభతో ఉపకారవేతనానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఎంపీటీసీ రమేష్‌రాజు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.