తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల మరియు శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు దేవస్థాన విద్యాశాఖ వెల్లడించింది.
అర్హత కలిగిన విద్యార్థులు https://admission.tirumala.org వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను మే 6, 2026 నుంచి జూన్ 3, 2026 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరించబడతాయని, కళాశాలలకు హార్డ్ కాపీలు సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ యూజర్ మాన్యువల్ మరియు కళాశాల ప్రాస్పెక్టస్ తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ముందుగా వెబ్సైట్లోని Student Manual in Telugu/English ఎంపికల ద్వారా దరఖాస్తు విధానాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. అనంతరం Junior College విభాగంలోకి వెళ్లి, రెండు కళాశాలల్లోని గ్రూపులు, సీట్లు, అర్హతలు, అడ్మిషన్ విధానం తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
విద్యార్థులు దరఖాస్తు నింపేటప్పుడు నమోదు చేసే వివరాలు, ధృవపత్రాల్లోని వివరాలతో పూర్తిగా సరిపోలాలని హెచ్చరించారు. ఏ ఒక్క వివరంలోనైనా వ్యత్యాసం ఉంటే, తాత్కాలికంగా కేటాయించిన సీటు ఆటోమేటిక్గా రద్దు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
అలాగే ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, హాస్టల్ సదుపాయాలు, నిబంధనలు తదితర అంశాలపై సందేహాల నివృత్తి కోసం వెబ్సైట్లోని Helpline Numbers ద్వారా సంబంధిత అధ్యాపకులను సంప్రదించవచ్చని తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్ 3, 2026.