గరుడధాత్రి న్యూస్ :
చిత్తూరు జిల్లా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే భాగంగా, ఇటీవల పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు సూచించారు
నేటి డిజిటల్ యుగంలో నేరస్తులు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా పోలీస్, సీబీఐ, ఈడీ వంటి అధికారులుగా నటిస్తూ భయపెట్టి డబ్బులు దోచుకునే సంఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో మోసగాళ్లు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా సంప్రదించి, “మీపై కేసు ఉంది”, “మీ ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా అక్రమంగా ఉపయోగించబడింది” వంటి అబద్ధాలు చెప్పి, బాధితులను గంటల పాటు ఆన్లైన్లో ఉంచి, బయటకు వెళ్లనీయకుండా భయపెడతారని ఎస్పీ గారు వివరించారు.
ఈ సమయంలో వారు బాధితుల వ్యక్తిగత వివరాలు సేకరించి, చివరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారని పేర్కొన్నారు.
👉 “పోలీసులు లేదా ఎటువంటి దర్యాప్తు సంస్థలు కూడా వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయవు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అవి మోసపూరితమని గుర్తించాలి.” అన్నారు.
👉 “భయం కలిగించే కాల్స్ వచ్చినప్పుడు ఆలోచించకుండా స్పందించకండి. మీ కుటుంబ సభ్యులతో లేదా స్థానిక పోలీసులతో సంప్రదించండి.” అని సూచించారు.
👉 “మీ బ్యాంక్ వివరాలు, OTPలు, పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దు. సైబర్ నేరగాళ్లు ఇదే అవకాశంగా తీసుకుంటారు.” అని హెచ్చరించారు.
*డిజిటల్ అరెస్ట్ మోసాల నుండి రక్షణ పొందేందుకు ప్రజలు పాటించాల్సిన సూచనలు:*
• అనుమానాస్పద కాల్స్ లేదా వీడియో కాల్స్కు స్పందించకండి.
• ఎవరైనా అధికారిగా పరిచయం చేసుకుంటే, వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో ధృవీకరించండి.
• ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయవద్దు.
• మీ వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచండి.
• వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించండి.
🚨 “సైబర్ నేరాలు కొత్త రూపాల్లో వస్తున్నాయి. అప్రమత్తతే రక్షణ. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, ఇతరులకు కూడా ఈ విషయాలను తెలియజేయాలి.” అన్నారు.
చిత్తూరు జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తూ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎవరైనా ఇటువంటి మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.