-ఈగల్ టీంతో అవగాహన కార్యక్రమం
పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) :
గంజాయి, మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా బుధవారం పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో “ఈగల్ టీమ్” ఆధ్వర్యంలో బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై లోకేష్ రెడ్డి, స్వర్ణ తేజ వారి సిబ్బందితో పాటు ఈగల్ టీమ్ ప్రతినిధులు కుమార్, గిరి పాల్గొని స్థానికులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువత, ప్రజలు గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా వాడకానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా భయం లేకుండా 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మాదకద్రవ్యాలు సేవించిన వారిని గుర్తించేందుకు ఉపయోగించే డ్రగ్ టెస్ట్ కిట్లు మరియు వాటి పనిచేసే తీరు గురించి ప్రజలకు, యువతకు క్షుణ్ణంగా వివరించారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం మరియు వాడకం చట్టరీత్యా నేరమని… ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.