తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక సూచనలు
—తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అమ్మవారి దర్శనం సాఫీగా, భద్రంగా జరగడానికి భక్తులు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
ముఖ్యమైన భద్రతా సూచనలు.
1. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.రద్దీ ప్రదేశాల్లో జేబుదొంగలు, చైన్ స్నాచర్లు సంచరించే అవకాశమున్నందున భక్తులు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు అధిక విలువైన బంగారు ఆభరణాలు ధరించకుండా రావడం మంచిది. పర్సులు, బ్యాగులు, మొబైల్ ఫోన్లు ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా ఉంచుకోవాలి.2. చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.రద్దీ సమయంలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల చేతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. పిల్లల జేబులో లేదా దుస్తులపై తల్లిదండ్రుల పేరు, ఫోన్ నంబర్, పూర్తి చిరునామా రాసిన గుర్తింపు చీటీ తప్పనిసరిగా ఉంచాలి. ఒకవేళ పిల్లలు తప్పిపోయినట్లయితే భయపడకుండా వెంటనే యూనిఫాంలో ఉన్న పోలీసులను సంప్రదించాలని ముందుగానే వారికి తెలియజేయాలి.3. అనుమానాస్పద వ్యక్తులు, అనాథ వస్తువులపై వెంటనే సమాచారం ఇవ్వాలి.జాతర ప్రాంగణంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించినా లేదా ఎవరూ లేని బ్యాగులు, అనాథ వస్తువులు కనిపించినా వాటిని తాకకుండా వెంటనే సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలి.4. పార్కింగ్ మరియు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను రహదారులపై ఎక్కడపడితే అక్కడ నిలిపివేయకుండా, పోలీసు వారు నిర్దేశించిన అధికారిక పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇతర భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి.5. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలిపిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో లేదా ఇతర ఎలాంటి సహాయం అవసరమైనా జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ ను వెంటనే సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం 112 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి.తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రశాంతంగా, భద్రంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారు కోరారు.