GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 6:31 am Posted by : GARUDA DHATRI NEWS

దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ధేందుకు శిక్షణ – శ్రీసిటీ ఎండీ

గరుడధాత్రి న్యూస్ :
దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శ్రీసిటీలో త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
గ్రోత్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవను అభినందించారు. సమర్థవంతమైన ప్రణాళిక, పనితీరు, నిరంతర కృషి వల్లే శ్రీసిటీ దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక పార్కులలో ఒకటిగా ఎదిగిందని ప్రశంసించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరిన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాల్సిన అవసరాన్ని శ్రీసిటీ ప్రయాణం, అనుభవం స్పష్టం చేస్తోందన్నారు.
డా. రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోంది. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం మరియు పారిశ్రామిక పురోగతిపట్ల మా కట్టుబాటును మరింత బలపరుస్తున్నాం అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ “ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త” లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని ఆయన పేర్కొన్నారు.