GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 11:34 am Digital Edition : GURU SWAMY

దీర్ఘకాల పార్టీ సేవకు తగిన గుర్తింపు ఇవ్వాలి – టిడిపి నేత సమాధి నాగరాజు

పార్టీ కోసం పదవులు నిర్వహించినా తగిన ప్రాధాన్యత దక్కలేదని సమాధి నాగరాజు వినతి

టీడీపీ అధిష్ఠానానికి కీలక బాధ్యత కోసం విజ్ఞప్తి

సత్యవేడు సెప్టెంబర్ 05 గరుడధాత్రి:

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ, విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతూ, వివిధ పదవుల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన తన రాజకీయ, సామాజిక అనుభవానికి ఇకనైనా తగిన గుర్తింపు కల్పించాలని టీడీపీ నాయకుడు, అడ్వకేట్ సమాధి నాగరాజు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.
గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించడంతో పాటు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సహకార సంఘం వైస్ చైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు ఆయన తెలిపారు. పలు సామాజిక సంస్థల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, ప్రజాసేవా నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ పదవుల్లో గానీ, ఇతర కీలక బాధ్యతల్లో గానీ తనకు తగిన ప్రాధాన్యత లభించలేదని నాగరాజు వినతిపత్రంలో పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువచ్చారు.
తనను కేవలం పదవి కోసం కాకుండా, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తగా, నాయకుడిగా గుర్తించి, తన అనుభవాన్ని పార్టీకి ఉపయోగపడే విధంగా తగిన బాధ్యత అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తన రాజకీయ, సామాజిక, విద్యా మరియు ప్రజాసేవా అనుభవాలను సమగ్రంగా పరిశీలించి, పార్టీకి ఉపయోగపడే కీలక బాధ్యతను కల్పించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని సమాధి నాగరాజు కోరారు.
“పార్టీ నిర్ణయం శిరోధార్యం.. బాధ్యత ఏదైనా పార్టీ బలోపేతమే లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.