ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
– పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర
గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల ప్రజలకు పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై బి. రాఘవేంద్ర కీలక సూచనలు చేశారు. ఇటీవల కాలంలో మోటార్ బైక్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనానికి సంబంధించిన ఆర్సీతో పాటు ఇతర అవసరమైన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.
అలాగే వేసవి కాలంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పిల్లలను చెరువులు, వంకలు, వాగుల వద్దకు ఒంటరిగా పంపించవద్దని హెచ్చరించారు. ఎండాకాలంలో పిల్లలను తమ దగ్గరే ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా లైసెన్స్ లేని చిన్నారులకు ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలు నడిపేందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వకూడదని ఎస్సై రాఘవేంద్ర హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.