పలమనేరు, ఆగస్టు 09 (గరుడ ధాత్రి ):
గంగవరం ఫ్లైఓవర్ పక్కన ఉన్న మిలటరీ కమ్యూనిటీ హాల్లో నిడిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1985-86 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం కోలాహలంగా జరిగింది. దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా అందించిన దాత వరదారెడ్డి విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని పూర్వ విద్యార్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన పూర్తి వ్యయాన్ని పూర్వ విద్యార్థి, మాజీ మిలటరీ ఉద్యోగి సుధాకర్ రెడ్డి స్పాన్సర్ చేయగా, మిగిలిన నిర్వహణ కార్యక్రమాలకు 1985-86 బ్యాచ్ విద్యార్థులందరూ భాగస్వాములై సహకరించాలని నిర్ణయించారు. అనంతరం తమ బ్యాచ్కి చెందిన స్వర్గీయ గణపతికి పూర్వ విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ కలయికలో మాజీ మిలటరీ సుధాకర్ రెడ్డి, పల్లెరుచులు అమరనాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు రత్నా రెడ్డి, లాయర్ భాస్కర్, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సుబ్రమణ్యం రెడ్డి, ఉపాధ్యాయులు నరసింహులు, పెద్దపంజాణి మండల టిడిపి అధ్యక్షుడు ఆనంద, కృష్ణారెడ్డి, అక్రమ్ భాషలతో పాటు 30 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.