దాత మాదిరాజు గణేష్ రాజు దాతృత్వం
కార్వేటి నగరం ఆగస్టు 13 (గరుడ దాత్రి న్యూస్):
రోడ్డు ప్రమాదంలో వాహన చోదకులు ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులై నిరాశ్రయులు అవుతున్న నేపథ్యంలో తన వంతు సాయం చేయాలనే దృక్పథంతో కార్వేటినగరం మండలం కృష్ణాపురం కు చెందిన మాదిరాజు గణేష్ రాజు 1000 మందికి హెల్మెట్ల వితరణకు ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, మాజీ సర్పంచ్ ఆదాం అలియాస్ సుందరరాజన్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కార్వేటినగరం మండలం చిత్తూరు – పుత్తూరు జాతీయ రహదారి అమ్మపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో కార్వేటినగరం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రం, ఎస్ఆర్ పురం మండలాల వాహన చోదకులు వెయ్యి మందికి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే థామస్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ రానున్నారు. ఇప్పటికే దాత మాదిరాజు గణేష్ రాజు, మాజీ సర్పంచ్ ఆదాం అలియాస్ సుందరరాజన్ నేతృత్వంలో సభ ఏర్పాట్లు చేపట్టారు. సీఐ హనుమంతప్ప సహా ఎస్ఐలు పర్యవేక్షిస్తున్నారు. సేవా దృక్పథంతోనే మాజీ సర్పంచ్ ఆదాం అలియాస్ సుందరరాజన్ స్ఫూర్తితో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు దాత మాదిరాజు గణేష్ రాజు తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను చేపడతామని ఆయన చెప్పారు. దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.