పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీన జరగబోయే పల్స్ పోలియో జాతీయ కార్యక్రమంపై పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వైద్యాధికారులు మరియు సూపర్వైజర్లకు శుక్రవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు, జిల్లా టీబీ మరియు లేప్రోసి అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పలమనేరు, వి.కోట, బైరెడ్డిపల్లి, కొలమాసనపల్లి, గంగవరం, పెద్దపంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పోలియో చుక్కల కార్యక్రమం వంద శాతం విజయవంతం కావాలన్నారు. ప్రతి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలి. విస్తృత ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. వలస వచ్చిన సంచార జాతులు నివసించే ప్రాంతాలు, కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు మరియు అవుట్ రీచ్ (దూర ప్రాంతాలు) ఏరియాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలి. ఒక్క పిల్లాడు కూడా మిగిలిపోకుండా వైద్యాధికారులు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్, హెల్త్ సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.