GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 8:09 pm Posted by : GURU SWAMY

పిచ్చాటూరులో ఆధార్ సేవల కోసం అవస్థలు..

-స్వంత ఖర్చులతో కేంద్రం ఏర్పాటు చేస్తానంటున్న యువనేత జార్జ్ విజయ్

పిచ్చాటూరు జూన్ 24 గరుడధాత్రి :
మండల పరిధిలో ప్రజలు ఆధార్ సేవలు పొందాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సచివాలయ కేంద్రాల ద్వారా ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్యోగులపై అదనపు పనిభారం ఉండటంతో ప్రజలకు సక్రమంగా సేవలు అందించడం కష్టంగా మారింది.
ముఖ్యంగా మండలంలోని సుదూర ప్రాంతాల ప్రజలు ఆధార్ సంబంధిత సేవల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై స్పందించిన స్థానిక యువజన నాయకుడు జార్జ్ విజయ్ సేవా స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ప్రజలకు సులభంగా ఆధార్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యయాన్ని తన స్వంత నిధులతో భరిస్తానని ప్రకటించారు.
అధికారులు చొరవ చూపి అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే పిచ్చాటూరు మండల ప్రజలకు ఆధార్ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.