పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో జూన్ 1 (సోమవారం)న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు తహశీల్దార్ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ వేదికలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్య, విద్యుత్, సంక్షేమ తదితర అన్ని శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. సమస్యలను ఒకే చోట నమోదు చేసుకుని పరిష్కరించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
ఫిర్యాదు సమర్పించిన ప్రతి ఒక్కరికీ అధికారిక రశీదు (అక్నాలెడ్జ్మెంట్) అందజేయబడుతుందని, నిర్ణీత గడువులో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించేందుకు ఆ రశీదు ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు.
జిల్లా కలెక్టర్ స్థాయిలో మాత్రమే పరిష్కారం అవసరమైన సమస్యలు మినహా, మండల స్థాయిలో పరిష్కరించగల అన్ని సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “పిచ్చాటూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి. అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఫిర్యాదులను నమోదు చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.