పిచ్చాటూరు, జూన్ 14 గరుడధాత్రి :
మండల ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జూన్ 15 సోమవారం న పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు తహశీల్దార్ చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులందరూ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు ప్రజలు మొదటగా ఎంపీడీవో కార్యాలయంలోనే తమ వినతులు సమర్పించాలని ఆయన సూచించారు.
ఫిర్యాదు అందజేసిన ప్రతి ఒక్కరికీ అధికారిక రశీదు (అక్నాలెడ్జ్మెంట్) అందజేయబడుతుందని, నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించేందుకు ఆ రశీదు ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో మాత్రమే పరిష్కరించాల్సిన సమస్యల కోసం ప్రజలు తిరుపతి కలెక్టరేట్ను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ చంద్రబాబు నాయుడు కోరారు. మండల స్థాయి అధికారుల సమక్షంలో ఫిర్యాదులను నమోదు చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.