పిచ్చాటూరు, ఆగస్టు 3 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం నాలుగు అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం అధికారులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్నచిన్న సమస్యల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి జిల్లా, రాష్ట్ర లేదా కేంద్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలోనే తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రజల వినతులను గ్రామ, మండల స్థాయిలోనే నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందని, సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులను ముందుగా సంప్రదించడం వల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తమ సమస్యలను వినిపించాలని అధికారులు కోరారు.