GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 7:40 pm Posted by : GARUDA DHATRI NEWS

పెండింగ్లో ఉన్న ఉపాధి బకాయిలు చెల్లించాలి

పెండింగ్లో ఉన్న ఉపాధి బకాయిలు చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం

నాగలాపురం, ఏప్రిల్ 28, (గరుడధాత్రి న్యూస్) :

నాగలాపురం మండలంలో గత డిసెంబర్ నెల నుంచి5నెలల పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు నాగలాపురం ఎంపీడీవో తేజశ్రీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దాసరి జనార్ధన్ మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి వరకు ఐదు నెలల బిల్లులు పెండింగ్లో పెట్టడం దారుణం అన్నారు.

వ్యవసాయ కూలీలు రోజువారి కూలీ చేస్తే గాని వారికి పూటగడవదని జనార్ధన్ ఆవేదన చెందారు. తక్షణమే ఎంపీడీవో జోక్యం చేసుకొని పెండింగ్ బకాయిలు పూర్తిగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మే నెలలో వేసవి తీవ్రత దృష్ట్యా పని గంటలు తగ్గించి మస్టర్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ వసతి మెడికల్ కిట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు గతంలో ఎండాకాలంలో సమ్మర్ అలవెన్స్ ఇస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వలేదాని తెలిపారు తక్షణమే మార్చి ఏప్రిల్ మే నెలలకు సమ్మర్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. కొత్తగా పెళ్లయిన వారికి జాబ్ కార్డులలో పేర్లు నమోదు చేయాలని, జాబ్ కార్డు కోరిన అందరికీ మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి మెలుగు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మురుగేష్ తదితరులు పాల్గొన్నారు.