GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 6:28 am Posted by : GURU SWAMY

పేద విద్యార్థుల చదువుకు చేయూత

నాగలాపురం, జూన్ 22 గరుడధాత్రి: తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కడివేడు సెంటర్‌లో ఆదివారం పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పెన్నులు, విద్యాసామాగ్రి పంపిణీ, భోజన సదుపాయం ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఉతుకోట సమీపంలోని పాలవాక్కం గ్రామానికి చెందిన సంఘసేవకుడు రాజా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు చదువు పట్ల అవగాహన కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. మానవత్వం అనే గొప్ప విలువ పాఠశాల నుంచే ప్రారంభమవుతుందని, జీవితాంతం ప్రతి మనిషి పట్ల ప్రేమ, గౌరవం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.
“ఉదయించే సూర్యుడు విద్యార్థుల కోసమే అన్న తపనతో చదవండి. మీ విద్య మీ జీవితాన్ని చల్లగా మార్చే చంద్రునిలా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎండలో కష్టపడి చిందించే ప్రతి చెమటబొట్టుకు విలువ చేకూర్చాలంటే బాగా చదవాలి” అని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఈ భూమిపై ఆనందంతో ముందుకు సాగే వ్యక్తులు విద్యార్థులేనని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
ఈ కార్యక్రమంలో దాసుకుప్పం మన్సూర్, డేవిడ్ కమలనాథన్, కృష్ణాపురం జె. విక్రమన్ తదితర సంఘసేవకులు పాల్గొన్నారు.