పిచ్చాటూరు, ఆగస్టు 22 గరుడధాత్రి :
త్వరలో జరగనున్న పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండలంలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 21 పంచాయతీలు, 180 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 21న పోలింగ్ కేంద్రాల ప్రిపరేషన్ ప్రక్రియ చేపట్టినట్లు, ఆగస్టు 23న డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
డ్రాఫ్ట్ జాబితాపై ప్రజలకు, సంబంధిత వర్గాలకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 26లోగా ఎంపీడీవో కార్యాలయంలో నేరుగా తెలియజేయాలని సూచించారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను ఆమోదం కోసం ఆగస్టు 29న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీకి పంపనున్నట్లు తెలిపారు.
అనంతరం ఆగస్టు 30న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ఎంపీడీవో మహమ్మద్ రఫీ వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సౌలభ్యం, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల ఎంపిక ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.