GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:13 am Digital Edition : GURU SWAMY

ప్రతి పీహెచ్‌సీలో 100% పరిశుభ్రత, మెరుగైన వైద్య సేవలు ఉండాలి : డీఎంహెచ్‌వో డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి

పలమనేరు, సెప్టెంబర్ 12 ( గరుడ ధాత్రి ) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి శనివారం పలమనేరు డివిజన్ పరిధిలోని గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డాక్టర్లు ప్రజలు మెచ్చుకునేలా నిరంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. దీని ద్వారా పీహెచ్‌సీపై ప్రజల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ పర్సెప్షన్) పెరిగి, ఆసుపత్రి గ్రేడింగ్ మెరుగుపడుతుందన్నారు. ప్రతి ఆసుపత్రి లోపల, బయట పరిసరాలను ఎల్లప్పుడూ 100 శాతం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మాతా శిశు సంరక్షణ సేవలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. పీహెచ్‌సీలలోనే కాన్పులు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సంజీవిని కార్యక్రమం, ఎల్‌సీడీసీ లెప్రసీ (కుష్టు వ్యాధి) సర్వేలను నాణ్యతతో చేపట్టాలి. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షిస్తూ వివరాలను 100 శాతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ఆకస్మిక తనిఖీల ద్వారా ఆసుపత్రుల్లో సేవల నాణ్యత, పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తామని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.