GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:17 am Digital Edition : GURU SWAMY

ఫోన్‌కు బానిసై ఆసుపత్రిపాలైన నటి షకీలా.. మెడకు సర్జరీ, రూ.3 లక్షల ఖర్చు!

ప్రముఖ నటి షకీలా ఫోన్‌ వినియోగం కారణంగా తీవ్ర మెడ సమస్యకు గురై శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరిన ఆమె.. తన ఆరోగ్య పరిస్థితి గురించి వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
షకీలా తెలిపిన వివరాల ప్రకారం.. తాను బెడ్‌పై పక్కకు తిరిగి గంటల తరబడి మొబైల్‌లో గేమ్స్ ఆడటంతో పాటు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉండేవారు. రోజుకు సుమారు నాలుగు గంటల వరకు గేమ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ క్రమంలో మెడపై తీవ్ర ప్రభావం పడి నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించారు.
మెడకు సంబంధించిన సమస్య తీవ్రం కావడంతో తాజాగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు షకీలా తెలిపారు. ఈ సర్జరీకి సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. సర్జరీ అనంతరం మెడకు కాలర్‌ ధరించి, ఇతరుల సహాయంతో కదులుతున్న దృశ్యాలను కూడా ఆమె వీడియోలో చూపించారు.
ఈ సందర్భంగా షకీలా ప్రజలకు కీలక సూచన చేశారు. మొబైల్ ఫోన్ అవసరానికి మించి ఉపయోగించవద్దని, ముఖ్యంగా పిల్లలను ఎక్కువసేపు ఫోన్‌కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. అవసరమైన విషయాలకే ఫోన్‌ను వినియోగించాలని సూచించారు.
తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన షకీలా.. తెలుగు ప్రేక్షకులకు కూడా పలు సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం సర్జరీ అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు.