పిచ్చాటూరు, జూన్ 15 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ పాల్గొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్ఏలు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు, అనర్హుల వివరాలను గుర్తించి తొలగించే ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎంపీడీవో మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని బీఎల్ఏలకు సూచించారు.
సమావేశంలో మండలంలోని వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలు, బీఎల్వోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.