GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 6:34 am Posted by : GARUDA DHATRI NEWS

భక్తి పారవశ్యంలో అగ్నిగుండ ప్రవేశం..

భక్తి పారవశ్యంలో అగ్నిగుండ ప్రవేశం..

ధర్మరాజుల మహోత్సవాలకు భక్తుల వెల్లువ..

అమ్మవారి వేషధారణలో యువత సందడి..

కేవీబీపురం- గరుడ దాత్రి న్యూస్ మే 31

మండలంలోని శ్రీనివాసపురం (మారప్పరెడ్డి కండ్రిగ) గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో అత్యంత విశిష్ట ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం ఆదివారం ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, సమీప ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది భక్తులు కంకణాలు ధరించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిగుండంలో ప్రవేశించారు.
ఈ సందర్భంగా గ్రామ యువకుడు ప్రభాకర్ ద్రౌపతి దేవి అమ్మవారి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల అలంకరణలు, సంప్రదాయ వేషాలు, భక్తి గీతాలతో గ్రామ వీధుల్లో సందడి చేశారు. యువత ప్రదర్శించిన భక్తి, ఉత్సాహం మహోత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చింది.అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలను సమకూర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు పర్యవేక్షించారు.
భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ అగ్నిగుండ ప్రవేశం మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపగా, వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తరలివచ్చారు. ధర్మరాజుల స్వామివారి మహోత్సవాలు గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తి సంప్రదాయాలకు అద్దం పట్టాయని పలువురు భక్తులు పేర్కొన్నారు.