శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 13 గరుడధాత్రి న్యూస్:
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు పిలుపునిచ్చారు.
వినాయక చవితి సందర్భంగా నాలుగు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, మట్టి వినాయక విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు.
ప్రకృతి పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని ఎస్సీవీ నాయుడు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాలుగు నియోజకవర్గాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.