GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 5:49 pm Posted by : GURU SWAMY

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి

పిచ్చాటూరులో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

పిచ్చాటూరు, జూన్ 17 గరుడధాత్రి :

మాదకద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బుధవారం “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, సమాజంపై పడే తీవ్ర ప్రభావాలను వివరించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల వ్యాపారం, వినియోగంపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఉంచిందని, ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
యువత తమ లక్ష్యాల సాధనకు క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఏలుమలై, గోవిందరెడ్డి, ఉదయ్, కుమార్, పాండియన్ తదితరులు పాల్గొని మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.