GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 8:54 pm Posted by : GARUDA DHATRI NEWS

మద్యం తాగొద్దన్నందుకు ఇళ్లలోకి దూరి దాడి

-కువ్వాకుళ్లి–ఎల్లకట్టవ గ్రామాల మధ్య ఉద్రిక్తత

వరదయ్యపాళెం, జూన్ 7: వరదయ్యపాళెం మండలంలోని కువ్వాకుళ్లి పంచాయతీ ఎస్సీ కాలనీలో మద్యం తాగవద్దని ప్రశ్నించినందుకు ఎల్లకట్టవ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి మూకుమ్మడిగా దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం బాధితులు టీడీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
బాధితుల కథనం ప్రకారం, కువ్వాకుళ్లి ఎస్సీ కాలనీ సమీపంలోని గంగమ్మ రచ్చబండ వద్ద ఎల్లకట్టవ గ్రామానికి చెందిన కొందరు యువకులు మద్యం సేవిస్తుండగా, జనావాసాల మధ్య మద్యం తాగవద్దని స్థానికులు సూచించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం మద్యం సేవించిన వ్యక్తులతో పాటు వారికి మద్దతుగా మరికొందరు ఎల్లకట్టవ గ్రామస్థులు కాలనీలోకి వచ్చి ఇళ్లలోకి చొరబడి పురుషులు, మహిళలపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. మహిళలను సైతం విడిచిపెట్టకుండా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, ఎల్లకట్టవ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తరచూ రాత్రివేళల్లో మద్యం మత్తులో బైకులపై తిరుగుతూ కాలనీ వద్ద అలజడి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జన్మదిన వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో కాలనీలో బ్యానర్లు ఏర్పాటు చేయడం, టపాసులు కాల్చడం వంటి చర్యలతో వివాదాలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు.
ఎల్లకట్టవ గ్రామస్థుల ఆగడాల నుంచి తమకు రక్షణ కల్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.