గరుడధాత్రి న్యూస్ :
టిడిపి మహానాడు సందర్భంగా ప్రతి నాయకుడు, ముఖ్య కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలన్న పార్టీ ఆదేశాల మేరకు, తిరుపతి ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని తన నివాసంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ దంపతులు పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నాటి నుంచి స్వర్గీయ రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు , లోకేష్ వంటి మూడు తరాల నాయకత్వంలో పార్టీకి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
మే 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్న 2026 మహానాడును ఈసారి సరికొత్త విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదట నెల్లూరులో భారీ బహిరంగ సభగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో మహానాడును నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారని పేర్కొన్నారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొంటారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ల పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు వర్చువల్ విధానంలో మహానాడులో భాగస్వామ్యం కానున్నారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడుకు ప్రత్యేక స్థానం ఉందని, ఇది కేవలం రాజకీయ సమావేశం కాకుండా లక్షలాది మంది కార్యకర్తలను ఒకచోటకు చేర్చే “పసుపు పండుగ” అని అభివర్ణించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులంతా ఒకే కుటుంబంలా కలిసి సంబరాలు చేసుకుంటారని చెప్పారు.
“కార్యకర్తలే అధినేత” అనే భావనతో గ్రామస్థాయి కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకు అందరికీ ఒకే వేదికపై గౌరవం దక్కుతుందని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి సత్కరించేందుకు మహానాడు గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీ వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై కీలక తీర్మానాలు మహానాడులో చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. అలాగే జాతీయ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ ఆధ్వర్యంలో మహిళలు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు జి. నరసింహ యాదవ్ వెల్లడించారు.