GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 7:06 pm Posted by : GARUDA DHATRI NEWS

మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -రైతు సంఘం నాయకుడు ఉమాపతి నాయుడు

పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) :
మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారిని ఆదుకున్న రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఉమాపతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, నష్టాలను వివరించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతుల కష్టాలపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి, మామిడి రైతులకు అండగా ఉంటూ నిన్నటి రోజున శుభవార్త అందించారని ఉమాపతి నాయుడు పేర్కొన్నారు. మామిడి రైతులకు మేలు చేసేలా గత సంవత్సరం తరహాలోనే ఈసారి కూడా కిలోకు ₹4 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. గుజ్జు (పల్ప్) పరిశ్రమలు రైతులకు కిలోకు ₹8 రూపాయలు చెల్లించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. “రైతాంగానికి మారుపేరుగా నిలిచే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లా రైతు సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు
ఉమాపతి నాయుడు తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని వేలాది మంది మామిడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఉమాపతి నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని, రైతులకు నిర్దేశిత ధర దక్కేలా చూడాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.