GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:29 am Digital Edition : GURU SWAMY

ముసలిమడుగులో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం

– కుంకీ ఏనుగులకు ప్రత్యేక పూజలు, అలంకరణ

– విద్యార్థులకు ఏనుగుల దాడుల నుంచి తప్పించుకునే మెలకువలపై అవగాహన

పలమనేరు, ఆగస్టు 12 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో బుధవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను అటవీశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపులోని కుంకీ ఏనుగులకు సిబ్బంది స్నానపానాదులు చేయించి, ప్రత్యేక రంగులతో అందంగా అలంకరించారు. అనంతరం ఏనుగులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వాటికి పండ్లు, ఫలహారాలు అందజేశారు. ఈ ఆసక్తికరమైన వేడుకలను తిలకించేందుకు పలమనేరులోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలిఫెంట్ క్యాంపు ఆవరణలో డీఎఫ్‌వో వేణుగోపాల్, ఎఫ్‌ఆర్‌వో చంప్లనాయక్ తదితరులు మొక్కలు నాటారు. అనంతరం గంగవరం పాఠశాల విద్యార్థులకు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాల్లో ఏనుగుల కదలికలను ఎలా గుర్తించాలి, అకస్మాత్తుగా ఏనుగులు దాడికి వస్తే ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి తదితర కీలక మెలకువలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ డీఆర్వో, సెక్షన్ ఆఫీసర్లు, సుకుమార్, రమేష్ సిబ్బంది రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు స్థానికులు పాల్గొన్నారు.