-పాదయాత్ర సహచరులను పేరుపేరునా పలకరించిన మంత్రి నారా లోకేష్*
తన వెంట నడిచిన కార్యకర్తలను ఎన్నటికీ మరిచిపోనని మరోసారి చాటిచెప్పారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్.
ఏ వేదికైనా, ఏ కార్యక్రమమైనా యువగళం పాదయాత్రలో తనతో పాటు నడిచిన కార్యకర్తలు కనిపిస్తే వారిని పేరుపేరునా పలకరించి, ఆప్యాయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. యువగళం బంధం కేవలం పాదయాత్రతో ముగిసేది కాదని, అది చిరస్థాయి అనుబంధమని మరోసారి నిరూపించారు.
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ సందర్భంగా తిరుపతిలోని వధువు నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్, అక్కడ యువగళం పాదయాత్రలో తనతో కలిసి ఎండనక, వాననక నడిచిన టిడిపి కార్యకర్తలను చూసి వెంటనే వారివద్దకు వెళ్లారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారితో కలిసి కూర్చొని దాదాపు 15 నిమిషాల పాటు ఆప్యాయంగా ముచ్చటించారు.
పాదయాత్ర సమయంలో ఎదురైన సవాళ్లు, నాటి వైసీపీ ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొంటూ ఉద్యమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తల సేవలను మంత్రి లోకేష్ గుర్తుచేసుకున్నారు. యువగళం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు వంటి చర్యలు చేపట్టామని వివరించారు.
✍ “కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతంతో టిడిపి కేడర్ సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సూర్యప్రకాశ్, వెంకటప్ప, చంద్ర, ఎల్లప్ప, లక్ష్మీపతిలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జస్వంత్, రవి నాయుడులతో పాటు మిగిలిన యువగళం బృందం గురించి కూడా ఆరా తీశారు. అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నాదెండ్ల బ్రహ్మం చౌదరికి శుభాకాంక్షలు తెలియజేసి, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.