GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 5:37 pm Digital Edition : GURU SWAMY

యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా

చంద్రగిరి టౌన్‌లో 176 మందికి గంజాయి పరీక్షలు

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరం

తిరుపతి, సెప్టెంబర్ 13 గరుడదాత్రి న్యూస్

యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి టౌన్‌లో ప్రత్యేక గంజాయి పరీక్షలు నిర్వహించారు. చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ సురేష్ కుమార్, పోలీసు సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సుమారు 176 మందికి గంజాయి పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, సామాజిక నష్టాలపై అవగాహన కల్పించారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణా, నిల్వపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు లేదా డయల్‌-112కు సమాచారం అందించాలని కోరారు. యువత భవిష్యత్తును కాపాడటం, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు.